శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): దురదృష్టవశాత్తూ బైక్ అదుపు తప్పడంతో వాటర్ ట్యాంకర్ కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లం పేట కేవీఆర్ వ్యాలీలో నివాసం ఉంటున్న మోకిడి దీపక్ (29) మాదాపూర్లో విఠల్రావు నగర్లో ఉన్న ఎగ్జా పయోనీర్ టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మే 7వ తేదీన తెల్లవారు జామున 2.10 గంటల సమయంలో విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనం (TS 03 EE2377)పై వెళ్తున్నాడు. పర్వత నగర్ సిగ్నల్ వైపు నుంచి హైటెక్సిటీ వైపు సిగ్నల్ వద్ద మలుపు తీసుకోగానే తన ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో తన ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ (TS12 UA 9090) ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ క్రమంలో దీపక్ బైక్ వాటర్ ట్యాంకర్ కిందకు వెళ్లింది. ట్యాంకర్ టైర్లు అతని మీదుగా వెళ్లాయి. దీంతో తీవ్ర గాయాలకు గురైన దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు, ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దీపక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.