శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): మదర్సాలో చదువుతున్న ఓ విద్యార్థి బయటకు వెళ్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓల్డ్ హఫీజ్పేటలోని సాయినగర్లో నివాసం ఉంటున్న ఎండీ అష్రఫ్ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు ఎండీ అసద్ అహ్మద్ (11) మదీనాగూడలో ఉన్న మదర్సాలో విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా మే 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మదర్సా నుంచి బయటకు వెళ్లిన ఎండీ అసద్ తిరిగి రాలేదు. దీంతో చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద అతని ఆచూకీ కోసం విచారించినా ఫలితం లేదు. ఈ క్రమంలో అష్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా అసద్ మదర్సా నుంచి బయటకు వెళ్లినప్పుడు తెల్లని నెహ్రూ షర్ట్, కుర్తా పైజామా ధరించి ఉన్నాడని, అతని ముఖం కోలగా ఉంటుందని, ఛామన ఛాయ రంగులో ఉంటాడని, ఎత్తు 4 అడుగుల 5 అంగుళాలు ఉంటుందని, ఎవరికైనా అతని ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.