శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కేఫ్ వద్ద ఉన్న శ్మశానవాటిక సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయస్సు సుమారుగా 45 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందని, అతను బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్స్, నలుపు రంగు శాలువా ధరించి ఉన్నాడని, జుట్టు నల్లగా ఉందని పోలీసులు తెలిపారు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.






