శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో ఓ నిండు ప్రాణం బలైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కూకట్పల్లిలోని శాతవాహన నగర్ రాంకీ పెరల్ విల్లా నం.150లో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మీ స్థానికంగా పలు ఇళ్లలో పని మనిషిగా చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకు నున్న గోపి ప్రవీణ్ (21) అనే కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా మే 19వ తేదీన రాత్రి 11 గంటలకు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకని లింగంపల్లి వెళ్లాడు.
కాసేపు అయ్యాక 20వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో గోపి ప్రవీణ్ను శామ్యూల్ అనే స్నేహితుడు తన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంపై కూకట్పల్లి వైపు తీసుకువస్తున్నాడు. మార్గమధ్యలో మదీనాగూడ బావర్చి వద్ద రహదారిపై శామ్యూల్ నడిపిస్తున్న ద్విచక్ర వాహనం దురదృష్టవశాత్తూ స్కిడ్ అయింది. అతి వేగంగా వాహనాన్ని నడిపించడంతో వాహనం రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో శామ్యూల్కు గాయాలు అవగా, ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్నేహితులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న శ్రీకర హాస్పిటల్కు తరలించగా ప్రవీణ్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.