నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో నుంచి ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన భర్త అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్ లో తుక్కాని నర్సింహా రెడ్డి (46) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 9 వ తేదీన ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి టీఎస్ 15 ఈసీ 0342 నంబర్ గల యమహా బైక్ పై వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో అతని భార్య తుక్కాని సుజాత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ అని రావడంతో కంపెనీకి వెళ్లి ఆరా తీయగా నాలుగు రోజుల క్రితమే తన భర్త నర్సింహా రెడ్డి ఉద్యోగం మానేశాడని కంపెనీ వారు చెప్పారు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పోలీస్ స్టేషను లో నర్సింహా రెడ్డి భార్య సుజాత ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం లేనందుకే తన భర్త కనబడకుండా వెళ్లిపోయాడని భార్య సుజాత అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇంటి నుంచి బయల్దేరే సమయంలో స్కై బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు మియాపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగలరని కోరారు.
