దేశవ్యాప్తంగా ఉన్న పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్ కార్డులను, ఆధార్ కార్డులతో అనుసంధానించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే అనేక మార్లు గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇక ఇందుకు గాను మార్చి 31, 2021 వరకు మరోసారి గడువును పొడిగించింది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
మొత్తం 50.95 కోట్ల పాన్ కార్డులను జారీ చేయగా.. వాటిల్లో 32.71 కోట్ల పాన్ కార్డులను మాత్రమే ఆధార్ కార్డులను అనుసంధానించారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. మిగిలిన 18.24 కోట్ల పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించలేదని వెల్లడైంది. అయితే నిర్ణీత గడువులోగా ఈ రెండు కార్డులను అనుసంధానించకపోతే గడువు తేదీ తరువాత అలాంటి ఒక్కు కార్డు హోల్డర్పై రూ.10వేల జరిమానా విధిస్తామని కూడా ఆదాయపు పన్ను శాఖ గతంలోనే తెలిపింది. అందువల్ల వెంటనే ఆ రెండు కార్డులను లింక్ చేయాలని ఆ శాఖ సూచించింది.
పాన్ కార్డును ఆధార్ కార్డులతో లింక్ చేయకపోతే గడువు తేదీ తరువాత పాన్ కార్డు పనికిరాకుండా పోతుందని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి స్థితిలో పౌరులు ఎలాంటి కార్యకలాపాలు కూడా నిర్వహించలేరని పేర్కొంది. అందువల్ల ఆయా కార్డులను అనుసంధానించుకోవాలని ఆ శాఖ సూచించింది.
పాన్ కార్డును ఆధార్తో ఇలా అనుసంధానం చేయవచ్చు…
* www.incometaxindiaefiling.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అయ్యేందుకు పాన్ నంబర్ను యూజర్ ఐడీగా, డేట్ ఆఫ్ బర్త్ను పాస్వర్డ్గా ఉపయోగించవచ్చు.
* లాగిన్ అయ్యాక ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ లింక్ ఆధార్ ఆప్షన్ను ఎంచుకోవాలి.
* ఒక వేళ మీ పాన్ ఇప్పటికే ఆధార్తో లింక్ అయి ఉంటే.. యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ఆధార్ అని నంబర్తో చూపిస్తుంది.
* ఆధార్ తో లింక్ కానట్లయితే అక్కడ ఒక ఫాం కనిపిస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలను పాన్ కార్డులో ఉన్నట్లుగా ఎంటర్ చేయాలి. తరువాత ఆధార్ నంబర్ను నమోదు చేసి, కింద ఉండే కాప్చా కోడ్ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.
* అనంతరం తెరపై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. అలా వస్తే పాన్ కార్డు ఆధార్తో లింక్ అయినట్లు నిర్దారించుకోవాలి.
ఇక పైన తెలిపిన సైట్లోకి లాగిన్ అవకుండానే నేరుగా హోం పేజీ ద్వారా అక్కడ ఉండే లింక్ సహాయంతో పాన్ కార్డ్ ను ఆధార్కు లింక్ చేయవచ్చు. అందుకు http://incometaxindia.gov.in/Pages/default.aspx అనే లింక్ ఓపెన్ చేయాలి. అక్కడ వచ్చే లింక్ ఆధార్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. అనంతరం ఒక ఫాం ప్రత్యక్షమవుతుంది. అందులో పాన్, ఆధార్ నంబర్, పేరు తదితర వివరాలను నమోదు చేయాలి. ఆధార్ కార్డుపై కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే ఫాంలో I have only year of birth in Aadhaar card అనే ఆప్షన్ కు టిక్ చేయాలి. కాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఫాం సబ్మిట్ అయ్యాక తెరపై your PAN is successfully linked to Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇలా పాన్, ఆధార్లను లింక్ చేయవచ్చు.
ఇక 567678 లేదా 56161 అనే నంబర్లకు ఎస్ఎంఎస్ను పంపించడం ద్వారా కూడా ఆధార్, పాన్ను అనుసంధానించవచ్చు. అందుకు గాను UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ను టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ను టైప్ చేయాలి. ఆ మెసేజ్ను ముందు చెప్పిన నంబర్లకు పంపించవచ్చు. దీనికి ఎలాంటి చార్జిలు కావు.
ఉదాహరణ: మీ ఆధార్ నంబర్ 111122223333, పాన్ నంబర్ AAAPA9999Q అనుకుంటే.. UIDPAN 111122223333 AAAPA9999Q అని మెసేజ్ పంపించాల్సి ఉంటుంది.
అదేవిధంగా పాన్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి అక్కడ అనెక్షర్-1 ఫాం నింపి, సంబంధిత పత్రాలను అందజేసి నిర్ణీత రుసుము చెల్లించడం ద్వారా కూడా పాన్, ఆధార్లను లింక్ చేయవచ్చు.
అయితే వెబ్సైట్ ద్వారా ఆధార్, పాన్లను లింక్ చేసే క్రమంలో ఆధార్ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు ఓటీపీలు వస్తాయి. వాటిని సంబంధిత ప్రదేశాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను ఆధార్తో మొబైల్ లింక్ అయి ఉండడం అవసరం. అప్పుడే ఓటీపీల ద్వారా ఆధార్ ను వెరిఫై చేసి రెండు కార్డులను లింక్ చేసేందుకు వీలు కలుగుతుంది.