శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): బస్సులను నడిపించే సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలను నివారించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ బస్సులను నడపాలని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మియాపూర్ లోని ఆర్టీసీ బస్ డిపో-1లో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రంజన్ రతన్ కుమార్తోపాటు ట్రాఫిక్ ఏడీసీపీ వీరన్న, కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీ, ఆర్ఎంవో శ్రీలత, డీఆర్ఎంవో సరస్వతి, డీఎం-1 మోహన్ రావు, ఆర్టీవో నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ బస్సులను నడిపిస్తున్నప్పుడు రోడ్డుపై డ్రైవర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు క్షణం చాలని, డ్రైవర్ అలర్ట్గా ఉంటే అనేక ప్రమాదాలను చాలా వరకు తప్పించవచ్చని అన్నారు. ట్రాఫిక్ నియమాలను అనుసరించి వాహనాలను నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఆర్టీవో సిబ్బంది, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.






