జీవోలతో బీసీల గొంతుకోసిన కాంగ్రెస్ : 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రెండు సంవత్సరాలుగా జీవోలు, ఆర్డినెన్స్, అసెంబ్లీ తీర్మానాల పేరుతో కాలయాపన చేసి చివరికి జీవోల పేరుతో మరోసారి బీసీల గొంతుకోసిన కాంగ్రెస్ ప్రభుత్వం చ‌ట్ట ప్రకారం కాకుండా పార్టీ ప్రకారమే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరమని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పేర్కొంది. చివరికి మరో జీవో 46పేరుతో జీవోను తీసి ఎన్నికలకు వెళ్లడం జీవోలతో బీసీలను వంచించడమే అని స‌మితి నాయ‌కులు అన్నారు. చట్టబద్ధత లేకుండా గ్రామ పంచాయతీలకు ఎన్నికలను జరపాలని పార్టీ పరంగా 42% బీసీలకు కేటాయించి జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల‌ ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఎఎస్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ , రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లతో కలసి మాట్లాడుతూ తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్య సంఘటనగా ఉద్యమిస్తామని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలు భిక్షగాళ్ళు కాదని కాంగ్రెస్ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు ఎస్ దుర్గయ్య గౌడ్, బోయ గోపి , బైరుశేఖర్ గంగపుత్ర, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, పాలకూరి అశోక్, అవ్వారు వేణు, చెన్న శ్రీకాంత్ నేత, దామోదర్ గౌడ్, ఎర్రమాదు వెంకన్న నేత, లింగేశ్ యాదవ్, మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here