నమస్తే శేరిలింగంపల్లి: హిందుత్వ కూటములను ఓడించడమే ఎంఐఎం పార్టీ ప్రధాన ధ్యేయమని, అందుకు అనుగుణంగా తగిన రాజకీయ కార్యాచరణతో తాము ముందుకు సాగుతున్నామని ఆ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ యువజన నాయకుడు ఇమ్రాన్ అహ్మద్ అన్నారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణపై బీజేపీ యువజన నాయకుడు రాగిరి సాయిరాం గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖండించారు. మజ్లీస్ పార్టీ ఎవ్వరికీ గులాం కాదని, గ్రేటర్ ఎన్నికల్లో మజ్లీస్ పోటీ చేస్తున్న స్థానాల్లో ఎ ఇతర రాజకీయ పార్టీలతో తాము ఎలాంటి ఒప్పందాలు, కూటములు చేసుకోలేదని తెలిపారు, మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకు గా చూసే కాంగ్రెస్ పార్టీ, ఓటర్లను వర్గాలుగా విభజించే బీజేపీ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు అని అన్నారు. సాయిరాం గౌడ్ ఇతరులను విమర్శించే పనిని వదిలి సొంత పార్టీ పనులు చూసుకోవాలని హితవు పలికారు. హిందుత్వ కూటములను ఓడించేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉంటామని అందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనాలకోసం దారుస్సలాం ఎల్లవేళలా తెరచి ఉంటుందని తెలిపారు.





