శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూ హఫీజ్పేటలోని మార్తాండనగర్ కాలనీ 40 ఫీట్ల గణేష్ టెంపుల్ రోడ్డులో ఉన్న రోడ్ నంబర్ 6లో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ నీళ్లు రోడ్డుపై పొంగుతూ ఒక చిన్న కాలువ లాగా మారి దుర్వాసన వెదజల్లుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగనబోయిన హైమావతి ఆరోపించారు. ఇదే రోడ్డుకు ఇరువైపులా రెండు ప్రైవేట్ స్కూల్స్, మూడు అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయని, చిన్నారులు సైతం అదే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మూలలో చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని, సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్నా కూడా దుర్వాసన విపరీతంగా వస్తుందని, దోమలు విజృంభిస్తున్నాయని, అందువల్ల అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాలనీలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా పాత పైపులు తీసి కొత్త పైపులు వేయాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బడ్జెట్ కేటాయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.






