- 154 మంది సైబరాబాద్ పోలీసు అధికారులకు సేవ పతకాలు అందజేసిన సిపి స్టీఫెన్ రవీంద్ర
నమస్తే శేరిలింగంపల్లి: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తూ వస్తున్నది. అయితే 2015-2022 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులలో సైబరాబాద్ కమీషనరేట్ నుంచి 74 మందికి సేవా పతకాలు, 34 మందికి అతి ఉత్కృష్ట పతకాలు, 46 మందికి ఉత్కృష్ట పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఉత్తమ సేవా పతకం, అతి ఉత్కృష్ట పతకం, ఉత్కృష్ట పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు సైబరాబాద్ పోలీసులు మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులను, పండుగలను పబ్బాలను వదులుకొని రాత్రి పగలు కష్టపడి పనిచేసి మెడల్స్ సాధించినందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపిఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపిఎస్., ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాస్ రావు, సిఏఆర్ ఎడిసిపి రియాజ్, ఏసిపిలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.