శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగార్జున ఎనక్లేవ్, అల్లూరి సీతారామరాజు నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, శ్రీల గార్డెన్, ఎఫ్సీఐ, శ్రీ లక్ష్మీ నగర్, కృషినగర్, ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్, జనప్రియ వెస్ట్ సిటీ, కేకే ఎనక్లేవ్ తదితర కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు దేశభక్తి వాతావరణంలో జరిగాయి.

ఈ కార్యక్రమాలకు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికి ఆదర్శమని అన్నారు. దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాల ఫలితమే భారత స్వాతంత్ర్యమని శ్రీకాంత్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. త్రివర్ణ పతాకం సగర్వంగా నింగికి ఎగరడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. దేశ సరిహద్దుల్లో వీర జవాన్లు చేస్తున్న నిరంతర పోరాటం వల్లే ప్రజలు సురక్షితంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
భారతీయత అనే ఐక్యతా బంధంతో ముందుకు సాగుతూ, పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలని శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రగతి పథంలో పయనిస్తున్న నవభారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ మియాపూర్ డివిజన్ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన, జెండావందనం కార్యక్రమాలతో ఆయా కాలనీల్లో స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది.





