నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపేలా చూడాలని ఆరంబ్ టౌన్ షిప్ టీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ఆరంబ్ టౌన్ షిప్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంబ్ టౌన్ షిప్ లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ వారు అమ్మకానికి పెట్టాలని చూస్తున్నారని అన్నారు. రెవెన్యూ సిబ్బంది గురువారం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి శుభ్రం చేయించారని చెప్పారు. గతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ వారు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇస్తామని నేటికి ఇవ్వలేదని వాపోయారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పందిస్తూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తామని చెప్పారు.






