నమస్తే శేరిలింగంపల్లి: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణానంతరం జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నర్సింహయ్య తనయుడు నోముల భరత్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భరత్ను ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం నోముల భరత్ ను కలిసిన భేరిరాంచందర్యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ నోముల సేవలను గుర్తించి ఆయన కుటుంబానికి టికెట్ కేటాయించడం పట్ల రాంచందర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. సాగర్ ప్రజలకు నోముల నర్సింహయ్య చేసిన సేవలే భరత్ విజయానికి దోహదం చేస్తాయన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు నోముల భరత్ ను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడి రఘునాథ్ యాదవ్, శంషాబాద్ నగేష్ యాదవ్, రాజు యాదవ్, దొంతి బోయిన శ్రీనివాస్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, రవి యాదవ్, బాలరాజు యాదవ్, అశోక్ యాదవ్, యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






