-
శేరిలింగంపల్లి స్పెషల్ డ్రైవ్ లో అక్రమ నిర్మాణాల నేలమట్టం

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని చెరువులు, నాలాలు, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తహశీల్దారు వంశీ మోహన్ ఆదేశాలతో రెవిన్యూ, ఇరిగేషన్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

మండల పరిధిలోని కొండాపూర్,గోపన్ పల్లి, చందానగర్, మక్తా, శేరిలింగంపల్లి, మియాపూర్, కొండాపూర్ విలేజ్ తదితర ప్రాంతాల్లో నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు కొండాపూర్ గ్రామంలో జంగమోని కుంట సర్వ్ నెంబరు 134 లో అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ ను తొలగించారు. సున్నం చెరువు ఆక్రమణలను, చందానగర్ గ్రామం లో గల బచ్చుకుంట, గంగారం పెద్ద చెరువు లలో సైతం అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తహశీల్దారు వంశీ మోహన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల 4 వ తేదీ నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు. చెరువులు, నాలాలు, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు చంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, సర్వేయర్ మహేష్, ఇరిగేషన్ ఏఈఈలు శేషగిరిరావు, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.






