శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని స్వగృహ కాలనీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లో మహిళల కోసం ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళల కోసం బ్యూటీ పార్లర్ మెళకువలు, కుట్టు మిషన్, నర్సింగ్ కోర్సులు, బేకరీ పదార్థాల తయారీ వంటి అనేక కోర్సులను అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మహిళలు సుజాత యాదవ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆర్గనైజర్స్ అరుణ, శృతి, విజయ, ఎటిఎఫ్డబ్ల్యూఓఏ మెంబర్స్ భాస్కర్, రామిరెడ్డి, మహిపాల్ యాదవ్, శ్రీనివాస్, నవీన్ రెడ్డి, బసవయ్య, రవి, దుర్గా రెడ్డి, నర్సింహలు పాల్గొన్నారు.

