- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధుల వినతి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బడ్జెట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సౌకర్యం కోసం వార్షిక క్యాలెండర్ను పరీక్షా తేదీలతో సహా విడుదల చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని అన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు గాను వార్షిక క్యాలెండర్ను పరీక్షా తేదీలతో సహా విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు గురు దక్షిణ నిమిత్తం రూ.5వేలు ఇప్పించాలని అన్నారు. అలా కుదరని పక్షంలో సీఎం కేసీఆర్ విద్యా పథకం కింద పేద విద్యార్థులకు కొంత మొత్తాన్ని ఇప్పించాలని అన్నారు. కోవిడ్ సమయానికి గాను పాఠశాలలకు నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఇతర పన్నుల విషయంలో సడలింపులు ఇవ్వాలని అన్నారు. అలాగే అద్దె భవనాల విషయంలో యజమానుల ఒత్తిడి లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా గాంధీ స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం జనరల్ సెక్రటరీ పీజే జగదీష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్.రాజేశ్వర్ రావు, ట్రెజరర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

