హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఇటీవల నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు 48 మంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికై చాలా రోజులు అవుతున్నప్పటికీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. వెంటనే కార్పొరేటర్లచే ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగమని, ప్రజల తరఫున మాట్లాడేందుకు తాము ఎన్నికయ్యామని అన్నారు. ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. తెరాస ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే కార్పొరేటర్లచే ప్రమాణ స్వీకారం చేయించాలని, దీంతో తాము కార్పొరేటర్లుగా ప్రజలకు సేవలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

