- జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం వ్యవహారంపై
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అసంతృప్తి - అధికారులు, బ్లాక్ మెయిలర్లు కలిసి నిర్మాణదారులను వేధిస్తున్నారని ఆగ్రహం
- అన్ని అనుమతులు ఉంటే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని గాంధీ వ్యాఖ్య
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గంలో శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ నగర్ సర్కిల్, కూకట్పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం వ్యవహారంపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు చేస్తున్నవారు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వాస్తవ పరిస్థితులను, ఆస్తి పత్రాలను పరిశీలించకుండా సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే అనుమతులు ఇచ్చిన కట్టడాలను కూడా కొనసాగనీయకుండా జీహెచ్ఎంసీ అధికారులు అడ్డు పడడం బాధాకరమన్నారు.

తేరగా వచ్చే సంపాదనకు అలవాటు పడ్డ కొందరు అదేపనిగా భవన నిర్మాణాల వద్దకు వెళ్ళి బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయటం, వారు ఆశించిన ఆదాయం రాని సందర్భంలో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి పదేపదే బెదిరింపులకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన ఆధారాలు ఉండక పోవటంతో ఈ బ్లాక్ మెయిలర్ల ఆగడాలకు అంతు లేకుండా పోయిందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వాస్తవాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి గానీ బ్లాక్ మెయిలర్లకు అవకాశం ఇవ్వడంతో అధికారుల నడవడికపై అనుమానాలు కలుగుతున్నాయని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేసి బ్యాంకు రుణాలతో ఒక నీడను ఏర్పాటు చేసుకునే క్రమంలో వారు పడుతున్న కష్టానికి ఈ బ్లాక్ మెయిలర్ల చర్యలు గోరు చుట్టుపై రోకలిపోటులా తయారయ్యాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం ప్రభుత్వ నిబంధనలతో కట్టుకోవడానికి సలహాలిచ్చి అక్రమాలకు అవకాశం లేకుండా సహకరించాల్సి ఉండగా రకరకాల కారణాలు చూపి అనుమతులు ఇవ్వకపోవడం, ఇచ్చిన అనుమతులతో చేపట్టిన నిర్మాణాలను ఆపడం సరైన విధానం కాదని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందికి గాంధీ సూచించారు.
నిర్మాణం జరుగుతున్న భవనం పక్కవారు గానీ, భవన నిర్మాణం వలన నష్టపోతున్నవారు గానీ ఫిర్యాదు చేయడంలో అర్ధం ఉంటుందని అన్నారు. కానీ ఒక గ్రూపుగా ఏర్పడ్డ కొందరు వ్యక్తులు, ఆ నిర్మాణంతో సంబంధం లేని వ్యక్తులు వందల సంఖ్యలో జిహెచ్ఎంసి అధికారులకు నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. జిహెచ్ఎంసి అధికారులు ఫిర్యాదుదారులతో సంధి కుదుర్చుకుని ఈ విధంగా చేస్తున్నారా ? అని నిర్మాణదారులు వాపోతున్నారని అన్నారు. ఈ క్రమంలో బ్లాక్ మెయిలర్ల కాసుల పంటకు జిహెచ్ఎంసి అధికారులే అవకాశం కల్పిస్తున్నట్లు తేట తెల్లమవుతుందని అన్నారు.
ఈ సంప్రదాయానికి చరమ గీతం పాడకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, బ్లాక్ మెయిలర్లు వారికి సహకరించే అధికారులు ఇకనైనా పద్ధతులు మార్చుకుంటే వారికే మంచిదని హితవు పలికారు. ఇల్లు కట్టుకునే వారు అధికారికంగా అన్నిరకాల అనుమతులు తీసుకొని ప్రశాంత వాతావరణంలో దర్జాగా ఇల్లు కట్టుకోవాలని, ఇలాంటి బ్లాక్ మెయిలర్లకు అవకాశం ఇవ్వకుండా ఇంటిని నిర్మించుకోవాలని, అనుమతులు తీసుకొని నిర్మించే ఇంటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.