భూకబ్జాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు: హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కేసు ద‌ర్యాప్తు
  • ఐటీ ఆఫీస‌ర్ల‌లా ఇంట్లోకి వ‌చ్చి కిడ్నాప్
  • 19 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు
  • కేసులో ఎ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఎ2గా మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌
  • కిడ్నాప్ వ్య‌వ‌హారంలో భూమా అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ‌రామ్ ప్ర‌మేయం
  • త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌న్న సీపీ

హైద‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): న‌గ‌రంలో ఎవరైనా సరే భూముల కబ్జాలకి పాల్పడితే వారిపై చ‌ట్టా రీత్యా చర్యలు తప్పవ‌ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ హ‌ఫీజ్‌పేట భూ వివాదం కేసులో మొత్తం 8 సెక్షన్ ల కింద నిందితులపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డిని ఎ1గా, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ను ఎ2గా, ఆమె భ‌ర్త భార్గ‌వ‌రామ్‌ను ఎ3గా చేర్చామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అఖిల‌ప్రియ‌కు గాంధీ హాస్పిట‌ల్‌లో వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని, త‌రువాత ఆమెను సికింద్రాబాద్ కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌ని సీపీ తెలిపారు.

విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

కాగా ఈ కేసుకు సంబంధించి మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు మాజీ క్రీడాకారుడు ప్ర‌వీణ్ రావు, ఆయ‌న సోద‌రులు సునీల్‌, న‌వీన్‌ల ఇంటికి 10 మంది వ్య‌క్తులు ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారుల‌మ‌ని చెప్పి వ‌చ్చార‌ని, వారు సెర్చ్ వారంట్ చూపించార‌ని, అనంత‌రం ఇంట్లో ఉన్న కొంద‌రిని బెడ్‌రూంలోకి పంపి గ‌దికి తాళం పెట్టార‌ని, త‌రువాత ప్ర‌వీణ్ రావు, సునీల్‌, న‌వీన్‌ల‌ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయార‌ని తెలిపారు. అనంత‌రం 10.20 గంట‌ల‌కు డ‌య‌ల్ 100కు కాల్ వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం రాత్రి నార్త్ జోన్ ప‌రిధిలోని బోయిన్‌పల్లి పీఎస్ లో కిడ్నాప్ కేస్ నమోదు అయింద‌ని తెలిపారు.

కాగా కిడ్నాప్ కేసు న‌మోదు చేప‌ట్టిన పోలీసులు నిందితుల కోసం గాలించ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే నిందితులు ఆ ముగ్గురినీ నార్సింగి వ‌ద్ద వ‌దిలి వెళ్లారు. అయితే ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిల ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గవ రామ్‌ల ప్ర‌మేయం ఉంద‌ని తెలియ‌డంతో పోలీసులు భూమా అఖిల ప్రియ‌ను అరెస్టు చేశారు. కూకట్‌ప‌ల్లిలోని తన నివాసంలో అరెస్ట్ వారెంట్‌తో వెళ్లి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

హ‌ఫీజ్‌పేట భూవివాదం కేసులో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గ‌త సంవ‌త్స‌రం నుంచి త‌గాదాలు నెల‌కొన్నాయ‌ని సీపీ తెలిపారు. కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ‌, ఆమె భర్త భార్గవ రామ్‌ల ప్ర‌మేయం ఉంద‌న్నారు. కిడ్నాప్ కేసును న‌మోదు చేసుకున్న వెంట‌నే మంగ‌ళ‌వారం రాత్రి మొత్తం 15 బృందాలుగా ఏర్ప‌డి పోలీసులు అన్ని ప్ర‌దేశాల‌ను జ‌ల్లెడ ప‌ట్టార‌ని తెలిపారు. ఆంధ్ర పోలీసు అధికారుల స‌హాయం కూడా తీసుకున్నామ‌న్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును త్వ‌ర‌గా ఛేదించామ‌న్నారు. నిందితులంద‌రూ మెడ‌లో టైలు ధరించి ప్రొఫెష‌న‌ల్ గా ఇంట్లోకి వ‌చ్చి బాధితుల‌ను కిడ్నాప్ చేశార‌ని వివ‌రించారు.

ఈ కేసుకు సంబంధించి ప్ర‌త్యేక టీంను ఏర్పాటు చేస్తున్నామ‌ని సీపీ అంజ‌నీకుమార్ తెలిపారు. ఇందులో ఇంకా ఎంత మంది ప్ర‌మేయం ఉంది అన్న కోణంలోనూ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కిడ్నాప్ కేసును 19 గంట‌ల్లోనే ఛేదించామ‌ని, మొత్తం 10 నుంచి 15 వ‌ర‌కు నిందితులు ఇందులో పాల్గొన్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే నిందితులు ఉప‌యోగించిన ఫేక్ ఐడీ కార్డులు, న‌కిలీ సెర్చ్ వారెంట్‌, మార్పిడి చేసిన కార్ నంబ‌ర్ ప్లేట్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతానికి కొంద‌రి పేర్లు మాత్ర‌మే బ‌య‌టికి వ‌చ్చాయ‌ని, కేసు ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతుంద‌ని, భూ వివాదం అస‌లు ఏమిటి అనే విష‌యంతోపాటు పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here