హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా తెరాసలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు అక్తర్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సమక్షంలో తెరాస పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తెరాసలో చేరుతుండడం శుభ పరిణామమన్నారు. వారి సూచనలను పాటిస్తూ ముందుకు సాగుతామన్నారు. హఫీజ్పేట డివిజన్ తెరాస అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్కు ఓటు వేసి ఆమెను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని కోరారు.
తెరాసలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. అందరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో అందరం ముందుకు సాగాలని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, షాధీ ముబారక్, ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళా ఫించన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక గొప్ప పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





