శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చాకలి చెరువు అధ్వాన్న స్థితిపై స్థానిక ప్రజలు గళమెత్తారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ పిలుపు మేరకు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. చాకలి చెరువు ప్రస్తుతం చెత్తకుప్పగా మారి, నిల్వ నీటితో దోమలకు నిలయంగా మారింది. దీనివల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా స్థానికులు వంట-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. చాకలి చెరువును తక్షణమే శుభ్రపరిచి, శాశ్వత పరిష్కారం చూపే వరకు మా పోరాటం ఆగదు.. అని పొట్ట నరేందర్ యాదవ్ స్పష్టం చేశారు.






