శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీవాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్న శ్రీకాంత్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలోని డ్రైనేజీలు, నాలాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా గుర్తించిన చిన్నచిన్న సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మయూరి నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు. PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్లో మంజూరైన అభివృద్ధి పనులను విడతలవారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ అధ్యక్షుడు కె. రామరాజు, జనరల్ సెక్రటరీ కిషోర్, అసోసియేషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమణా రెడ్డి, వేణు, కృష్ణ కుమార్, నాగరాజు, ప్రేమానందం, వెంకటరామిరెడ్డి, రత్న కుమార్తోపాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.





