శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు భద్రతలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా భద్రతా నియమాలు పాటించాలని ఆర్సీ పురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్. విద్యా సాగర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంజీరా పైప్లైన్ రోడ్ వద్ద హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ వినియోగం ద్వారా గాయాలు, మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్. విద్యా సాగర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినవే అధికంగా ఉంటున్నాయని అన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందుతున్నారని, అందువల్ల హెల్మెట్ను ధరిస్తే ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు మాత్రమే కాకుండా వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు రాములు, జి.మల్లన్న, ఏఎస్ఐ మల్లయ్య, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






