శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారంతో తయారు చేసిన గాలిపటాల దారం) వాడకం వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతోంది. ఈ ప్రమాదకరమైన మాంజా కారణంగా గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుని, నిరపరాధులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడుతున్నారని వాయిస్ ఆఫ్ ది కామన్ మ్యాన్ తెలంగాణ చైర్మన్ రవీంద్ర రాథోడ్ అన్నారు.

పండుగలు, వేడుకల సమయంలో పిల్లలు, యువత గాలిపటాలు ఎగరేస్తూ ఆనందించాలి గానీ, అది ఎవరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. చైనీస్ మాంజా ఉపయోగించడం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా, మానవత్వానికి విరుద్ధం కూడా. వాయిస్ ఆఫ్ ది కామన్ మెన్ తెలంగాణ సంస్థ తరఫున ప్రజలందరికీ చైనీస్ మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని, సాధారణ పత్తి దారంతో తయారు చేసిన మాంజాను మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు, స్నేహితులకు, పరిచయస్తులకు ఈ ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని, చట్టాన్ని గౌరవిస్తూ, సమాజ భద్రతకు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరి చిన్న జాగ్రత్త అనేక ప్రాణాలను కాపాడగలదని, భద్రతాయుతమైన పండుగలు, ఆనందకరమైన సమాజం కోసం మనమందరం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.





