శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రైటింగ్స్, కటౌట్లు, ఫ్లెక్సీలతో నగర రూపురేఖలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సీబీఎంసీ అధికారులు సూచించారు. ఈ మేరకు డిజిటల్ ప్రింటర్లు, ఆఫ్సెట్ ప్రింటర్లు, థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు, కటౌట్లు, ఫ్లెక్సీలు తదితరాలను ఏర్పాటు చేయకుండా చూడాలని అధికారులు స్పష్టం చేశారు. తమ సంస్థల పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడటంతో పాటు సీబీఎంసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అనధికారికంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం లేదా ఇతరులతో ఏర్పాటు చేయించడాన్ని అనుమతించబోమని పేర్కొంటూ సంబంధిత యజమానుల నుంచి అండర్టేకింగ్/అఫిడవిట్ను అధికారులు స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను పోస్టర్ రహితంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.





