శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై రాజీ లేని విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందించడంతోపాటు పాడి రైతులకు మెరుగైన మద్దతు అందించాలనే లక్ష్యంతో విజయ డైరీని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

రానున్న రోజుల్లో పీజేఆర్ స్టేడియాన్ని ప్రజలు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పీజేఆర్ స్టేడియంలో విజయ డైరీ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయ డైరీలో పనిచేసే సిబ్బంది ప్రజలతో మమేకమై ఓర్పు, క్రమశిక్షణతో సేవలందించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, నాగేందర్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





