శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా, స్థానిక పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సంకల్పించారు. ఈ మేరకు మంగళవారం చందానగర్ మున్సిపల్ కమిషనర్ శశిరేఖని కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని పార్కుల్లో పిల్లల శారీరక వికాసానికి, ఉల్లాసానికి ప్రతి పార్కులో అత్యాధునిక ఆట వస్తువులతో కూడిన చిల్డ్రన్ ప్లే ఏరియా ను ఏర్పాటు చేయాలని యువత, వృద్ధులు, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, పార్కుల్లో వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, వెలుతురు కోసం విద్యుత్ దీపాలు, కూర్చోవడానికి బెంచీలు , పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలను నాటాలని తెలిపారు.
కార్పొరేటర్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ శశిరేఖ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పార్కుల ఆధునీకరణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నేతలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





