శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కుత్బుల్లాపూర్లోని శంభీపూర్ రాజు కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అలాగే ఎస్ఐఆర్తో గుర్తింపు ఉన్న ఓట్ల తొలగింపు అంశాలపై చర్చించారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి ఓటర్లకు అవగాహన కల్పించాలని నాయకులు సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ఐటీ, శాంతిభద్రతలు వంటి అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

కానీ ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ ఆలోచనల ఫలితమేనని తెలిపారు. ఈ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని నాయకులు కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.





