శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ జగన్నాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం పూరి, కేంద్ర సాంస్కృతిక శాఖ , ఒడిస్సా రాష్ట్ర సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పూరీలోని శ్రీ జగన్నాథ్ యూనివర్సిటీలో ఏప్రిల్ 18 నుండి 22 వరకు నిర్వహించిన ఒరిస్సా జాతీయస్థాయి ఉత్సవాలలో ప్రఖ్యాత సంగీతం నృత్య పాఠశాల స్వరమహతి సంగీతాలయం లింగంపల్లి నుండి ఏడుగురు విద్యార్థులు పాల్గొని విజయం సాధించారు. వరుసగా సీనియర్ కేటగిరీ హిందుస్థానీ విభాగంలో దేవులపల్లి మనస్విని మొదటి స్థానం, హార్దిక్ ఓం సాయి ద్వితీయ స్థానం, సుదర్శన్ వైభవి మలహర్ తృతీయ స్థానాన్ని, జూనియర్ విభాగంలో సింగావద్యుల మౌక్తిక మొదటి స్థానం, గుంటుపల్లి లక్ష్మీ శారద రెండవ స్థానం, ఉపశాస్త్రీయ విభాగంలో దేవులపల్లి మనస్విని మొదటి స్థానం, హార్దిక్ ఓం సాయి బత్తుల రెండవ స్థానాన్ని, కూచిపూడి, ఉప శాస్త్రీయ నృత్యాలలో త్రిష రెడ్డి, గాయత్రీ నాథ్ మొదటి ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.
సంస్థ డైరెక్టర్ డాక్టర్ బంధనపూడి ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ జాతీయస్థాయి ఫెస్టివల్ లో ఈ స్థాయిలో అవార్డ్స్ కైవసం చేసుకోవడం చాలా కష్టమైన పని, ఆనందదాయకం అన్నారు. పోటీలలో అత్యున్నత స్థానంలో నిలిచిన దేవులపల్లి మనస్విని జూన్ లో దుబాయ్ లో జరగబోయే భారత సంస్కృతి యాత్రకి ఎంపిక కావడం తెలంగాణకి గర్వకారణమని, పిల్లలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైపు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు.