శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సలహాదారు వీవీఎస్ రెడ్డి సూచనల మేరకు బాచుపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ను మెట్రో పిల్లర్ 600 వద్ద యు-టర్న్తో మళ్లించడం జరిగిందని తెలిపారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉండడంతో ఆల్విన్ రైట్ టర్న్ను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, వాహనాలకు మియాపూర్ మెట్రో రూట్లో వెళ్లేందుకు ఫ్రీ లెఫ్ట్ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు వాహనాలు సజావుగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.






