శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ శ్రీ సీతా రామాంజనేయ దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, నయనానందకరంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు డివిజన్ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు.






