- పది నెలల తర్వాత తెరచుకున్నప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు
- భౌతిక దూరంతో తరగతులకు హాజరైన విద్యార్థులు
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ డిప్యూటి డైరక్టర్ ఆకస్మిక తనిఖీలు
- పాఠశాలల వద్ద నెలకొన్న సందడి వాతావరణం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు మూసి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శేరిలింగంపల్లిలో ఎట్టకేలకు తెరుచుకున్నాయి. గత విద్యా సంవత్సరం రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయగా, 20-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే 9, 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ముందుగా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ తీర్మాణించడంతో సోమవారం పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా బెంచీకి ఇద్దరు మాత్రమే కూర్చునేలా చర్యలు చేపట్టారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఊష్ణోగ్రత పరీక్షలు నిర్వహించడంతో పాటు చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. తరగతి గదిలో విద్యార్థులు మాస్్క తప్పనిసరిగా ధరించే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఇదేవిధంగా మండల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తరగతి గదుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు. శరీర ఊష్ణోగ్రత పరీక్షలు నిర్వహించి తరగతులకు అనుమతించారు. విద్యార్థులకు కరోనా నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ విద్యాబోధన చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ మాస్కులను ధరించారు. ఎంతో కాలం నుంచి స్కూళ్లు మూసి ఉండి సోమవారం తెరుచుకోవడంతో పాఠశాలల వద్ద విద్యార్థులతో సందడి వాతావరణం కనిపించింది.

విద్యాశాఖ డిప్యూటీ డైరక్టర్ ఆకస్మిక తనిఖీలు
మియాపూర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ విద్యాశాఖ డిప్యూటి డైరక్టర్ వెంకట నర్సమ్మ, మండల విద్యాధికారి వెంకటయ్యలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు వంటశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను అన్ని పాఠశాలల్లో తూచ తప్పకుండా పాటించాలని ఆమె తెలిపారు. విద్యాసంవత్సరపు సిలబస్ను త్వరగా పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు.

శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 40శాతం విద్యార్థులు హాజరు
శేరిలింగంపల్లి మండల పరిధిలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు 40 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మండల వ్యాప్తంగా 9, 10వ తరగతి చదివి విద్యార్థులు 2486 మంది ఉండగా 999 మంది విద్యార్థులు హాజరయ్యారు. శేరిలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతుల్లో కలిపి 419 మంది విద్యార్థులకు గానూ 138 మంది, లింగంపల్లి పాఠశాలలో 163 మంది విద్యార్థులకు గానూ 50 మంది, కొండాపూర్ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు గానూ 80 మంది, దర్గా పాఠశాలలో 253 మందికి గానూ 84 మంది, దర్గా ఉర్దూ మీడియం పాఠశాలలో 42 మందికి గానూ 16 గురు, ఖాజాగూడ పాఠశాలలో 118 మందికి గానూ 62 మంది, మియాపూర్ పాఠశాలలో 345 మందికి గానూ 149, మక్తా మహబూబ్పేట్ పాఠశాలలో 99 మందికి గానూ 41 మంది, న్యూ హఫీజ్పేట్ పాఠశాలలో 63 మందికి గానూ 26గురు, కొత్తగూడ పాఠశాలలో 316 మందికి గానూ 118 మంది, మాదాపూర్ పాఠశాలలో 289 మందికి గానూ 135 మంది, గచ్చిబౌలి పాఠశాలలో 190 మందికి గానూ 79 మంది, వేముకుంట ఉర్దూ మీడియం పాఠశాలలో 39 మందికి గానూ 21 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు.






