శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఉన్న భగవాన్ శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి సందర్భంగా జరిగిన మహా నారాయణ సేవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని, మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని అన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, ఆయన అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి మన వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు, నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, మాధవరం గోపాల్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






