శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 7 ఏళ్ల విదేశీ చిన్నారి జీవితాన్ని రక్షించింది. గతంలో అనేక ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రయత్నించినా ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స సాధ్యపడదని నిరాకరించారు. ఈ చిన్నారి మెదడు స్టెమ్ ప్రాంతంలో అరుదైన, ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు గుర్తించబడింది. మెదడు స్టెమ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం, అక్కడ చేసిన తక్కువ పొరపాటుకూడా తీవ్ర న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ క్లిష్టమైన కేసును సీనియర్ కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ డా. శ్రీకాంత్ రెడ్డి స్వీకరించి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో సహా అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ట్యూమర్ పూర్తిగా తొలగించడమే కాకుండా చిన్నారికి ఎటువంటి న్యూరాలాజికల్ సమస్యలు ఎదురవలేదని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పిల్లల ఐసీయూ కీలక భూమిక పోషించింది. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడేందుకు మైక్రో లెవెల్ మానిటరింగ్, వెంటిలేటరీ మద్దతు, న్యూరో ప్రొటెక్షన్ పద్ధతులతో చికిత్సను కొనసాగించారు. బ్రెయిన్ సర్జరీ తరువాత పిల్లల చికిత్స చాలా సున్నితమైనది. ప్రతి నిమిషం ప్రతి పరిణామాన్ని సమీక్షిస్తూ తాము చికిత్సను ముందుకు తీసుకువచ్చామని పీడియాట్రిక్ ఐసీయూ హెచ్ఓడి డా. జనార్దన్ రెడ్డి తెలిపారు. బహుళ విభాగాల సమన్వయం, ప్రత్యేకమైన పీడియాట్రిక్ ఐసీయూ వాతావరణం చిన్నారి త్వరితంగా కోలుకోవడంలో కీలకంగా మారిందని ఆయన అన్నారు.
ఈ విజయాన్ని గురించి పిల్లల విభాగం హెచ్ఓడి డా. రవీందర్ రెడ్డి పరిగి మాట్లాడుతూ పిల్లల వైద్యంలో తాము కేవలం శస్త్రచికిత్స మాత్రమే కాకుండా, వారి మనోభావాలకు భరోసా కలిగించే విధంగా ఓ శ్రద్ధ గల చికిత్సా వాతావరణం కల్పిస్తామని, ఆ చిన్నారి కేసు తమ టీమ్ సమిష్టి నైపుణ్యానికి ఉదాహరణ అని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం ట్యూమర్ లొ-గ్రేడ్ గా నిర్ధారించబడిందని, ప్రస్తుతం చిన్నారి రేడియేషన్ చికిత్స పొందుతూ త్వరితంగా కోలుకుంటున్నాడని అన్నారు.