శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. డొనేషన్ల పేరుతో రూ. లక్షలు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలంటూ టీఏఎఫ్ఆర్సీ ముందు ప్రతిపాదనలు ఉంచాయని తెలిపారు. వాటిని తిరస్కరించాలని కోరారు. ఇప్పటికే ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు అధిక ఫీజులను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడు తున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చాయని తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వారితో కాలేజీలను నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. తనిఖీల సమయంలో కొందరు అధ్యాపకులను నియమించు కుంటున్నాయని తెలిపారు. వెంటనే సమస్యలన పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి హెచ్చరించారు.