శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పండుగను పురస్కరించుకుని మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిరియాల ప్రీతం తన నివాసం వద్ద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 కుటుంబాలకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన కిట్లను అందజేశారు. ప్రతి కిట్లో ఆయిల్ (1 లీటర్), బియ్యం (2 కిలోలు), షుగర్ (1 కిలో), బాదం (100 గ్రాములు), జీడిపప్పు (100 గ్రాములు), కిస్మిస్ (100 గ్రాములు), టీ ప్యాకెట్, పసుపు, కారం, సేమియా (అర కిలో) వంటి అవసరమైన వస్తువులను చేర్చారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది సేవ, త్యాగం, సహనానికి ప్రతీక. ఈ పవిత్రమైన సందర్భంలో ప్రతి కుటుంబం సంతోషంగా పండుగను జరుపుకోవాలని మా ప్రయత్నం. సమాజంలో ఎవరూ కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న సహాయం చేస్తున్నాం. అన్నదానం, సేవ చేయడం మన సంస్కృతి, దాన్ని కొనసాగించడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్, అంజాద్, యూసుఫ్, మోయిస్, హనీఫ్, మహమ్మద్ మోయిస్ ఖాసిం, పరదేశి నాయుడు, చంద్రశేఖర్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.






