శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్చెరు సర్కిల్లోని ముత్తంగి వార్డును జోనల్ కమిషనర్ సందర్శించారు. సందర్శనలో భాగంగా కంధనూర్, ఘన్పూర్, వెల్మల గ్రామాల్లో పారిశుధ్య పనులను, బోర్వెల్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పారిశుధ్య కార్యకలాపాలను సమీక్షించిన జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్లు పనిచేయకపోవడం, నీటి ఎద్దడి వంటి సమస్యలపై స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. బోర్వెల్ మరమ్మత్తులు, కొత్త బోర్వెల్ల ఏర్పాటు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పౌర సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జోనల్ కమిషనర్ వెంట సర్కిల్ స్థాయి ఉప కమిషనర్, సర్కిల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.






