శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాలగౌని బాల్ రాజ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశ్వదాన్ మహారాజ్ , జస్ట్ ఈశ్వరయ్య , బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ హాజరై మాట్లాడారు. 24న జరిగిన బీసీల మహాధర్నాలో పెద్ద ఎత్తున బీసీలు పాల్గొని జయప్రదం చేసిన తర్వాత 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు, 9వ షెడ్యూల్లో చేర్చేంతవరకు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నిష్క్రమించదని నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టి.చిరంజీవులు మాట్లాడుతూ 9వ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక మార్గమని, అదే శ్రీరామరక్ష అని, 42 శాతం రిజర్వేషన్లకు అప్పుడే రాజ్యాంగ రక్షణ ఉంటుందని తెలిపారు.

బాలరాజు గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్రవ్యాప్త ఉద్యమ ప్రణాళికను ప్రకటిస్తుందని తెలిపారు. డా.విషాదన్ మహారాజ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు నియామకం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాటం చేశాయని, కానీ రెండున్నర కోట్ల మంది బీసీలు 42% కోసం 9వ షెడ్యూల్ కోసం ఉద్యమిస్తుంటే రాజకీయ పార్టీలలో చలనం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి అనంతపుర అఘోర కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి, బిజెపికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అన్ని పార్టీలను ప్రజాక్షేత్రాలలో ముద్దాయిలని చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటాం అని అన్నారు. రాజ్యాధికార దిశగా పయనిస్తామని బీసీలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలు బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ప్రకటించారు. నవంబర్ 3న అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇస్తామని, 4 న కలెక్టర్ లకు వినతి పత్రాలు ఇస్తామని, 6న సీఎస్ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. 7న రాష్ట్ర స్థాయి విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని, 10న కామారెడ్డి జిల్లా కేంద్రలో భారీ సభ తో భవిష్యత్ కార్యాచరణ పోరాట ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ దుర్గయ్య గౌడ్, జాతీయ నాయకుడు ఆల్మెన్ రాజ్ , బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు కే వీ గౌడ్, బైరు శేఖర్ , రాఘవేంద్ర ముదిరాజ్, డా.విజయ్ భాస్కర్ , చెన్న శ్రీకాంత్, లింగేష్ యాదవ్, అవ్వారు వేణు తదితరులు పాల్గొన్నారు.






