శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమైనదని, రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఓటు హక్కును కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటును పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రతి పౌరుడికి లభించిన సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో ఓటరు నమోదుకు ముందుకు వస్తున్నప్పటికీ, ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీఎల్ఓలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, అయితే ఫారాలు ఐదు రోజుల ఆలస్యంగా అందడం, తక్కువ సమయం ఉండటం, హైరైజ్ భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి బీఎల్ఓలకు ప్రవేశం లేకపోవడం వంటి సమస్యలు కార్యక్రమ నిర్వహణకు ఆటంకంగా మారుతున్నాయని వివరించారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు రానున్న వారం రోజుల పాటు విస్తృత స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించి ఓటరు నమోదును పెంచేలా అందరూ కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, కాలనీల అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సోషల్ వర్కర్లు, ప్రజాప్రతినిధులు కలిసి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవేందర్ రావు, బోయ పండు, బీఎల్ఓ సూపర్వైజర్ రాజు, బీఎల్ఓలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.





