శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుకలను చందానగర్లోని సరస్వతి విద్యా మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ బిల్డర్, సమాజ సేవకుడు మిర్యాల రాఘవ రావు, ఆయన కుమారుడు ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిర్యాల రాఘవ రావు జాతీయ పతాక ప్రాముఖ్యతను వివరించగా, ప్రీతం విద్యార్థులలో దేశభక్తిని ప్రేరేపిస్తూ చక్కటి సందేశాన్నిచ్చారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ, దేశభక్తి ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు. పింగళి వెంకయ్య జీవిత విశేషాలను, దేశానికి ఆయన చేసిన సేవలను హృద్యంగా వివరించి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దుర్గా మహేశ్వర, పాఠశాల సెక్రటరీ రఘునందన్ రెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీరామచంద్రారెడ్డి, కోశాధికారి నాగభూషణరావు, సభ్యులు సుదీప్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






