శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3 లో అభివృద్ధి పనులను చేపట్టాలని జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు ఆధ్వర్యంలో కాలనీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో కాలనీ ఏర్పడినప్పుడు వేసిన కరెంట్ స్తంభాలు మార్చాలని కోరారు. దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రమాదకరంగా ఉన్న ఐరన్ స్తంభాల స్ధానంలో సిమెంట్ విద్యుత్ స్తంభాలను వేయాలని డీఈ యాదగిరిని ఫోన్ లో ఆదేశించారు. నిర్ణీత నీటి సరఫరాకు, అదనపు సరఫరా మంజూరుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాలనీలో డ్రెయినేజీ వ్యవస్ధను దశలవారీగా మెరుగుపరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కాలనీ అతర్గత రహదారులు, శానిటేషన్, వీధి దీపాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తేగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు ఎం. వేణుగోపాల్, ప్రభాకర్, హనుమంతరావు, పెద్దిరాజు, సైదారెడ్డి, పద్మనాభరెడ్డి ఉన్నారు.






