హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం కేసీఆర్ పాలన అంతమొందే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శుక్రవారం సాయంత్రం కొత్తపేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. అదే సీఎం కేసీఆర్ పాలనకు ముగింపని అన్నారు. బీజేపీని గెలిపించడం కోసం ఎక్కడికైనా వస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠంపై కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. హైదరాబాద్ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ రావల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Road Show in Greater Hyderabad, Telangana. https://t.co/EphlhP6wdY
— Jagat Prakash Nadda (@JPNadda) November 27, 2020
గ్రేటర్ ఎన్నికల్లో అందరం కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నడ్డా అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందన్నారు. అవినీతిని అంతమొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రేటర్లోని ప్రతి డివిజన్లోనూ కమలం పువ్వు వికసించాలని అన్నారు. అవినీతిని రూపుమాపాలంటే బీజేపీ అధికారంలోకి రావల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకుడు వివేక్ తదితరులు పాల్గొన్నారు.