గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ఎక్స్ రోడ్డు వద్ద నాలాను పరిశీలించారు. అనంతరం డివిజన్ పరిధిలోని పంచవటి కాలనీ, సాయి వైభవ్ కాలనీలలో పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. భారీ వర్షం కారణంగా వరద నీటితో నిండిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అన్నారు. ప్రజలు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు నరేష్, జగదీష్, జీహెచ్ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఏఈ కవిత, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.