శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అన్నమ స్వరార్చనలో పద్మజా చల్లా వీణార్చన సభక్తిపూర్వంగా అందించారు. శాస్త్రీయ వీణ వాయిద్యంపై చాలదా హరినామ సౌఖ్యామృతము, గోవింద గోవింద యని కొలువరే, తందనాన అహి, నగవులు నిజమని, కొలనులోని మును గోపికలు, పలుకు తేనియల తల్లి, జగడపు చనువుల, నారాయణతే నమో నమో,
అన్ని మంత్రములు ఇందే, చిత్తజ గరుడా మొదలైన బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమాచార్య సంకీర్తనలను శృతి బద్ధంగా వీణ పై ఆలపించారు. కార్యక్రమానికి వయోలిన్ పై మురళీధర్, మృదంగం పై ప్రసాద్ వాయిద్య సహకారం అందించారు.
అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.