శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జయభేరి కాలనీలోని జయభేరి Encleve INSIDEZ INTERIORS పక్కన ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ సెల్లార్ గుంత తవ్వారని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. ఒక వైపు వర్షాకాలం వచ్చిందని తెలిసి కూడా సెల్లార్ గుంతలను తవ్వుతున్నారని అన్నారు. ఈ సెల్లార్ గుంతకు ఆనుకుని మూడు వైపులా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఉన్నాయని, అవి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. వెంటనే సెల్లార్ గుంతలను పూడ్చేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే శ్రీరామ్ నగర్లోని ప్లాట్ నం.614 బి బ్లాక్ ఎదురుగా గత సంవత్సరం సెల్లార్ను నిర్మించేందుకు గుంతను తవ్వారని అన్నారు. ఈ గుంతను కూడా పూడ్చేయాలని అన్నారు. ఈ గుంతల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరి దోమలు, ఈగలకు ఆవాసంగా మారుతున్నాయని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇకనైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.