శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని ఆ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి స్సష్టం చేశారు. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడడంతోపాటు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం జరిగిందని, పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం హర్షనీయమని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన పని చేసినా వారికి ఇదే గతి తప్పదని హెచ్చరించారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కన్న బిడ్డ అయినా గాని పార్టీకి వ్యతిరేకంగా ఉంటే సస్పెండ్ చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇది చాలా మంచి పరిణామమని తాము భావిస్తున్నామని, పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. వారి మాటలు ప్రజల పైన ప్రభావం చూపుతాయని, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి కనుక కవిత మాట్లాడిన తీరు బాగాలేదని అన్నారు. పార్టీ వర్గాలు ఆలోచించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, దీన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తున్నాయని అన్నారు. ఇక ముందు ఎవరైనా పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.






