- పట్టభద్రులను ప్రలోభ పెట్టేలా టీఆర్ఎస్ పార్టీ హోర్డింగ్లంటూ మండిపడ్డ స్వతంత్ర అభ్యర్థి
నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఇష్టారీతిన పట్టభద్రులను ఉద్యోగాల పేరుతో ప్రలోభాలకు గురిచేస్తూ ప్రకటనలు, హోర్డింగ్ లను ఏర్పాటు చేయడంపై హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీ దేవిపై ఎన్నికల కోడ్ కింద కేసు నమోదు చేసి హోర్డింగ్ లను వెంటనే తొలగించాలని గత నెల 26వ తేదీన జరిగిన సమావేశంలో తానే ఎన్నికల కమిషన్, ఎన్నికల అబ్జర్వర్ హరిప్రీత్ సింగ్, ఈఓ ప్రియాంక దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మెట్రో పిల్లర్లకు టీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన హోర్డింగ్ లు, ప్రభుత్వ ప్రకటనలను తొలగించాలని డిమాండ్ చేసిన విషయాన్ని రాగం సతీష్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు ఫోటోలతో కూడిన ప్లెక్సీలను, హోర్డింగ్ లను ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్ అధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. వాటికి సంబంధించిన ఫోటోలను సైతం అబ్జర్వర్ హరిప్రీత్ సింగ్, ఈఓ ప్రియాంక ఫోన్లకు వాట్సప్ ద్వారా పంపినా ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఎన్నికల నియమాలు అధికార పార్టీ అభ్యర్థికి వర్తించదా అని రాగం సతీష్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హోర్డింగ్ ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుని పబ్లిసిటీ పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేడు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవించే హోర్డింగ్ లను, నిర్వాహకులను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేసి వారి జీవనోపాధి కోల్పోయేలా చేసిందన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవసరం ఉన్నప్పుడు హోర్డింగ్ లకు అనుమతులిస్తూ బలవంతంగా లాక్కొని ప్రచారాలు చేస్తుందన్నారు. ఇదిలా ఉంటే నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ నేరుగా మేయర్ చాంబర్ నుంచే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలను అందజేయడం టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని సతీష్ యాదవ్ చేశారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హోర్డింగ్ లను తొలగించాలని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులమంతా ధర్నా చేస్తామని, హైకోర్టుకు వెళ్తామని అన్నారు.
