
నియోజకవర్గ నీటి, డ్రైనేజీ సమస్యలపై చర్చ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో నెలకొన్న నీటి, డ్రైనేజీ సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ తో భేటి అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటి అయిన గాంధీ పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పలు డివిజన్లలో డ్రైనేజి సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయమని కోరినట్లు తెలిపారు. సీవరేజ్ పన్నుల బాకీ చెల్లింపుల విషయంలో పేద వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని దృష్టిలో పెట్టుకొని బకాయిల వసూళ్లను ఒత్తిడి చేయొద్దని తెలిపారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బకాయి పడ్డ సీవరేజ్ సెస్ వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు పేద వర్గానికి మరియు మధ్య తరగతి చెందిన వాళ్ళని పెద్ద ఎత్తున ఉన్న బకాయిలను వారు చెల్లించడం సాధ్యం కానీ విషయమని జలమండలి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. దీంతోపాటు కొండాపూర్ డివిజన్ పరిధిలోని జనార్ధన హిల్స్ , గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో కాలువ నిర్మాణంలో తొలగించిన మంచి నీటి పైప్ లైన్ ను పునరుద్ధరించి స్థానిక ప్రజల మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప మంచి నీటి బకాయి పన్నులు మాఫీ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపానన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎండి దానకిషోర్ సానుకూలంగా స్పందించారని, నిధులు, సమస్యల పరిష్కారంలో ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారని గాంధీ తెలిపారు.