శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు పిలుపునిచ్చింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో చందానగర్, దీప్తి శ్రీనగర్ డివిజన్లలో 5 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. శనివారం నుంచి ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న మట్టి వినాయక విగ్రహాలను శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ.. చందానగర్, దీప్తి శ్రీనగర్ డివిజన్లలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 వేల మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, సలీం, చందర్ రావు, గౌస్, అంజి యాదవ్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





